Thursday, January 13, 2011

సంక్రాంతి శుభాకాంక్షలు


మిత్రులకు, నా బ్లాగ్ మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

మాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 14 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. దేశంలో పెద్ద పండుగగా అన్ని ప్రాంతాల వారూ జరుపుకునే సంక్రాంతి పండుగ ముందు రోజును భోగి అంటారు. ఈ రోజున వివిధ కూరగాయలు, పాలు పోసి పులగాలు (పొంగలి) వండుతారు. ఈ భోగినాడే గొచ్చి గౌరీవ్రతం అనే వ్రతాన్ని ప్రారంభిస్తారు. భోగినాటి సాయంకాలం వేళ ఇంట్లో మండపాన్ని నిర్మించి అలంకరిస్తారు. ఆ అలంకరణలో పండ్లు, కూరగాయలు, చెరకు గడల లాంటి ప్రధానం వాడుతారు. మండపం మధ్యలో బియ్యం పోసి దాని మీద బంకమట్టితో చేసిన గౌరీ ప్రతిమను ఉంచుతారు. పూజ పూర్తి అయిన తర్వాత గౌరీదేవికి మంగళహారతులు పాడి ఆ రాత్రికి శయనోత్సవాన్ని చేస్తారు. ఆ మరునాడు అంటే మకర సంక్రాంతి నాడు ఉదయం సుప్రభాతంతో దేవిని మేల్కొలుపుతారు. ఇలా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సాయంకాలం వేళ ముత్తైదువులను పేరంటానికి పిలుస్తారు. నాలుగోరోజు గౌరీదేవికి పూజ అనంతరం ఉద్వాసన చెబుతారు. మంటపానికి అలంకరించిన కూరగాయలను నాలుగోరోజున కూర వండుతారు. ఇలా చేసిన కూరనే గొచ్చికూర అని అంటారు. ఆ తర్వాత గొచ్చి గౌరి ప్రతిమను చెరువులో గానీ, నదిలో కానీ నిమజ్జనం చేస్తారు. భోగినాడు ప్రారంభమైన ఈ వ్రతాన్ని కొంతమంది నాలుగు రోజులు, మరికొంతమంది ఆరు రోజులు చేయడం కూడా ఆచారం. భోగినాడు బొమ్మల కొలువు పెట్టడం కూడా వ్రత విధానంగానే ఆచరిస్తారు. అలాగే భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయడం లాంటి వాటితో, పేరంటాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇంద్రుడు ప్రీతికోసం ఈ పండుగ జరుపుతుంటారు.

మహారాణిలా వచ్చే సంక్రాంతి రోజున పూజ ఎలా చేయాలి?
మకర సంక్రాంతి పుణ్యదినాన దానధర్మాలు చేయడం ద్వారా జన్మజన్మల దారిద్ర్య బాధలు తొలగిపోతాయని విశ్వాసం. సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయడం ద్వారా సకలసంపదలతో పాటు దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తాయి. సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలంటూ ఉంటారు. మహారాణిలా ముందు "భోగిని" (భోగి పండుగ), వెనుక "కనుమ" (కనుమపండుగ)ను వెంటేసుకుని, చెలికత్తెల మధ్య రాకుమార్తెలా సంక్రాంతి వస్తుంది. ఇదేరోజున పితృదేవతారాధన చేయడం వల్ల వారి శుభాశీస్సులతో వర్ధిల్లుతారని పురోహితులు అంటున్నారు. అందుచేత సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే లేచి, పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరమును ముగ్గులతో అలంకరించుకోవాలి. స్త్రీలు తెల్లవారు జాముననే లేచి వారి వారి ముంగిళ్లలో రంగవల్లుల తీర్చిదిద్దుకోవాలి.

తెల్లవారు జాముననే హరిదాసు హరినామ సంకీర్తనలు, సాతాని జియ్యర్లు, జంగపుదేవరలు, బుడబుక్కల దొరలు, పంబలవాండ్లు, బైనాయుడులు, గంగిరెద్దుల వాళ్ళు ఇంటింటికీ తిరుగుతుంటారు. వారి వారి తీరులలో భక్తి గీతాలు పాడుతూ ఏడేడు జన్మలలో మన ఇళ్ల పెద్దలకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని దీవెనలు ఇస్తుంటారు. అన్ని కులాల వారు మకర సంక్రమణ సమయంలో తిలా తర్పణలు విడిచి గుమ్మడి పండ్లను దానం ఇస్తే విష్ణువుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ ఫలం వల్ల పెద్దలు తరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున తలస్నానము చేసి కొత్త బట్టలను ధరించి, చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, పండ్లను నైవేద్యంగా పెట్టి సూర్యభగవానుడిని (శ్రీహరిని), పితృదేవతలను ప్రార్థించుకుంటే మోక్షమార్గము, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. మకర సంక్రాంతి రోజున ఆడపడుచులను, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి, వారికి కొత్త బట్టలు పెట్టి... బంధుమిత్రులతో కలిసి ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు కొన్ని కొన్ని వ్రతాలను ఆచరించడం చేస్తారు. వాటిలో గొబ్బిగౌరి వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని భోగినాడు ప్రారంభిస్తారు. ధనుర్మాసం నెల పెట్టింది.. మొదలు సంక్రాంతి పండుగ వరకు ప్రతి ఇంటి లోగిలి రకరకాల ముగ్గులతో ముచ్చటగా కనిపిస్తుంది. ఆ ఇంటి ఆడపడుచులు ఆ ముగ్గుల మధ్యన అందంగా గొబ్బిళ్లను తీర్చిదిద్ది, గొబ్బిపాటలు పాడుతూ.. కేరింతలు కొడుతుంటారు.

సంక్రాంతికి ఈ ఏడాది సందడి కరువైంది

సంబరాలు అంబరాన్నంటే... తొలి పండుగ సంక్రాంతికి ఈ ఏడాది సందడి కరువైంది. సంబరాల సంక్రాంతి వచ్చిందంటే..గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో సందడే సందడి నెలకొంటోంది. ఆనందోత్సాహాలతో తెలుగు ముంగిళ్లు కళకళలా డుతుంటాయి. పల్లెల్లో ఇళ్ల ముంగిట ధాన్య రాశులు...వీధుల్లో రంగ వల్లులతో...పిండి వంటల ఘుమఘుమలు...కొత్త బట్టల మిలమిలలు...తలపించే ఈ పండుగ సందడి ఈ సంవత్సరం కాంతినివ్వడం లేదు. సంక్రాంతి పండుగలో ఆకాశంలో గాలిపటాలను ఎగురవేస్తారు. కానీ ఇప్పుడు గాలిపటాలతో పాటు, నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశంలో తేలుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సంక్రాంతి కళ తప్పింది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలన్నీ సంక్రాంతి నాటికి ఇళ్లకు చేరుకుంటాయి. ఆ సంబరాన్ని సంక్రాంతి ప్రతిబింభిస్తోంది. కానీ ఈ ఏడాది తొలి పండుగ రైతులను వెక్కిరిస్తోంది. అకాల వర్షంతో పంటంతా తడిసి ముద్దయి ఇంటికి కూడా చేరలేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నిత్యావసర, కూరగాయల ధరలు రెండింతలు పెరిగి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. పండుగ అంటేనే తీపి, పిండి వంటలు. ఆ వంటకాలు చేసేందుకు ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో ఆ వంటకాలు చేసుకునేందుకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు జంకుతున్నారు. చక్కెర చేదెక్కి, నూనె, నువ్వుల, ఉల్లి, వెల్లుల్లి ధరలు నాలుగింతలు పెరిగి ప్రజల బతుకులను పీల్చి పిప్పి చేస్తున్నాయి.

ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు

నలుగురు ఉన్న కుటుంబంలో గతంలో రూ.500లకు నెలకు సరిపడా సరుకులు వచ్చేవి. కానీ ఆ నలుగురికే ప్రస్తుతం ఆ సరుకులకే రూ.1500లకు పైగా వెచ్చించాల్సి వస్తోంది. జీవనం సాగేందుకు అవసరమైన నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. మొన్నటి వరకు రూ.18 నుంచి రూ.20 వరకు పలికిన చక్కెర నేడు రూ.35 నుంచి రూ.40లకు చేరింది. ప్రతి కూరలో అవసరమైన ఉల్లి, వెల్లుల్లిలు సామాన్య ప్రజల కంట నుండి నీరు తెప్పిస్తోంది. రూ.20లకు మించని ఉల్లిగడ్డ నేడు రూ.40లకు చేరింది. రూ.40లకు మించని వెల్లుల్లి నేడు రూ.300లకు చేరిందంటే ధరలు ఏ మేరకు పెరిగియో అర్ధం చేసుకోవచ్చు. అన్ని వంటకాల్లో ఉపయోగించే వంట నూనెలు అకస్మాత్తుగా పెరిగిపోయాయి. రూ.60లు దాటని నూనెలు రూ.80ల పైగానే పలుకుతున్నాయి. పిండివంటలకు ఉపయోగించే పప్పుల ధరలు అందనంత దూరంలో ఆకాశాన్నంటాయి. రూ.30లకు మించని కందిపప్పు నేడు రూ.65లకు చేరింది. నువ్వులు రూ.90లకు చేరుకుంది పెరిగిన ధరలతో సంక్రాంతి పండుగకు తయారు చేసుకునే పిండివంటకాలు కరువయ్యాయి. ప్రతి ఇంటిలోనూ ఘుమఘుమలాడే పిండి వంటకాలు ఇప్పటికే తయారు చేసుకోవాల్సినప్పటికీ పెరిగిన ధరలతో దాని జోలికి వెళ్లేందుకే జంకుతున్నారు. పండుగ పూటనే కాస్త నాన్‌ వెజ్‌తో పూట గడుపుకోవాలనుకునే ఆలోచనలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఉన్నారు. తొలి పండుగ అయిన సంక్రాంతికి పిండి వంటకాలు లేనట్లే..

దిగి రాని కూరగాయల ధరలు

పెరిగిన కూరగా యల ధరలు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు పచ్చడి మెతుకులతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.100 తీసుకెళితే..రెండు రకాల కూరగాయల ధరలు, కరివేపాకు, కొత్తమీర కొనలేక బిక్కముఖంతో ఇంటికి రావాల్సి వస్తోంది. గత నవంబరులో రూ.20లకు మించని కూరగాయల ధరలు నేడు రూ.40లకు తక్కువ కాకుండా ఉండడంతో పేద ప్రజలు లబోదిబోమంటున్నారు. దోసకాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. రూ.10లకు మించని దోసకాయ రూ.40లకు తక్కువ కాకుండా మార్కెట్లో అమ్ముతున్నారు. చిక్కుడుకాయ రూ.60, బెండకాయ రూ.40, టమా టా రూ.30, బీరకాయ రూ.45, ఉల్లి రూ.40 పలుకుతోంది. కోడిగు డ్డు విషయానికొస్తే ఒకటి రూ.3.50 చొప్పున విక్రయిస్తున్నారు. ఆకు కూరలకు వెళితే...రూ.10లకు రెండు కట్టలు కూడా ఇవ్వడం లేదు.

ఇంటికి చేరని ధాన్యపు సిరులు :

కొత్త సంవత్సరం తొలి పండుగ అయిన సంక్రాంతికి ధాన్యపు సిరులు ఇంటికొస్తాయి. కానీ అకాల వర్షాల మూలంగా పండుగకు ధాన్యపు సిరులు ఇంటికి రాకుండా పోయాయి. కోసిన మెదలు, కల్లాల్లో వచ్చిన రాసులు వర్షాల బారిన పడి తడిసి ముద్దయి నాశనమైపోయాయి. పంటంతా వర్షం పాలు కావడంతో మిగిలిన పంటను ఆరుమూరుకు అమ్ముకున్నారు. దీంతో పొలం నుండి నేరుగా ఇంటికొచ్చే ధాన్యపు సిరులు నేరుగా మార్కెట్‌కు వెళ్లిపోయాయి. రైతన్నల్లో సంక్రాంతి సంతోషాన్నివ్వలేదు. కుటుంబ సభ్యులతో కళకళలాడే ఇళ్లన్నీ..బోసిపోతున్నాయి.

No comments:

Post a Comment